న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా ఇరు సూచీలు రెండు శాతం వరకు బలపడ్డాయి. ఇంట్రాడేలో 1,400 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,263.67 పాయింట్లు లేదా 1.64 శాతం ఎగబాకి 78,111.24 పాయింట్లకు చేరుకున్నది. మరో సూచీ నిఫ్టీ 388.65 పాయింట్లు లేదా 1.63 శాతం అందుకొని 24,231.30 పా యింట్ల వద్ద నిలిచింది.
దీంతో మదుపర్ల సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.9,41, 461.60 కోట్లు పెరిగి రూ.4,58,55, 016.77 కోట్లు(4.91 ట్రిలియన్ డాలర్లు)కి చేరుకున్నది. సూచీల్లో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, పవర్గ్రిడ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. కానీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా సర్వీసెస్ 3.30 శాతం బలపడగా, ఐటీ 3.09 శాతం, ఇండస్ట్రియల్స్ 2.90 శాతం, పవర్ 2.87 శాతం చొప్పున బలపడ్డాయి.