న్యూఢిల్లీ, జూన్ 20: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను అమ్ముకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు, బ్యాంకులు, ఏఆర్సీలు కుమ్మక్కయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలోనే చిల్లర పైసల కోసం ఏఆర్సీలకు బ్యాంకులు రుణాలను అమ్మేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం మండిపడింది. ప్రజల సొమ్మును ఇష్టారీతిన ఎవరికిపడితే వారికి అప్పులుగా ఇవ్వడమేగాక, వాటి వసూలుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నది. ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. దాన్ని ప్రజల సంక్షేమానికే వాడాలన్నది.
‘ఏఆర్సీల నిర్వహణ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలి. ప్రజా ధనం దృష్ట్యా ఏఆర్సీల ఏర్పాటు అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం తప్పక ఉన్నది. నిజానికి ప్రజా ధనం గురించే మా ఆందోళన అంతా. ఈ అంశంలో ప్రభుత్వ బ్యాంకులు కాకుండా ప్రైవేట్ బ్యాంకులు ఏఆర్సీలతో లావాదేవీలు చేస్తున్నైట్టెతే వాటి జోలికి మేము వెళ్లబోం’ అని ప్రధాన న్యాయమూర్తి ఓ పిటీషన్పై స్పందిస్తూ అన్నారు. ‘ఈ వ్యవహారం పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ముడిపడింది. ప్రజా ధనం ప్రజల సంక్షేమానికే ఉపయోగపడాలి.
ఒకవేళ ఆ ధనం ప్రైవేటువాళ్ల చేతికి వెళ్తే దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉన్నది. మా ఆందోళనంతా ఇదే. ఏఆర్సీలు కూడా బ్యాంకుల చేతుల్లోనే ఉన్నాయి. రుణగ్రహీతలు, ఏఆర్సీలు, బ్యాంకుల మధ్య గట్టి బంధమే ఉన్నది మరి.’ కాంత్ అన్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తాల్లో రుణాలు ఇచ్చి, చివరకు వాటిని వసూలు చేయలేక ఏఆర్సీలకు చిల్లర పైసల కోసం బ్యాంకర్లు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. బకాయిలో 10-15 శాతం సొమ్మును బ్యాంకులు ఆశిస్తుంటే.. ఆ రుణాలను అగ్గువకు కొనడం ద్వారా ఏఆర్సీలు లాభపడుతున్నాయని, రుణ ఎగవేతదారులకూ ప్రయోజనం ఉంటుందని, తుదకు నష్టపోయేది బ్యాంకులేనన్నారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సంబంధిత వర్గాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటీషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రూ.1,537 కోట్ల రుణాలను ప్రభుత్వ బ్యాంకులు.. రెండు ఏఆర్సీలతో కేవలం రూ.73.50 కోట్లతో సెటిల్మెంట్ చేసుకున్నాయని ఆరోపిస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలైంది. ఏఆర్సీలతో కలిసి బ్యాంకులు చేస్తున్న ఈ మోసాలపై దర్యాప్తు చేయాలంటూ ప్రతీక్ష, మరో ఇద్దరు పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో ఎస్బీఐ, కెనరా, యూనియన్ బ్యాంక్, సెబీ, తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో), వివిధ ఏఆర్సీలకూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా నోటీసులిచ్చింది. నాలుగు వారాల తర్వాత మళ్లీ విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.
పిటీషనర్ల తరఫు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్.. బ్యాంకులు, ఏఆర్సీల మధ్య జరుగుతున్న లోన్ సేల్ వ్యవహారంలో ఖజానాకే నష్టం వాటిల్లుతున్నదన్నారు. అందుకే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఓ జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీని వేయాలని వాదించారు. ఇక నోయిడాకు చెందిన ఓ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎస్బీఐ సహా 7 బ్యాంకుల నుంచి 2012-15 మధ్య రూ.912 కోట్ల రుణాన్ని తీసుకున్నదని పిటీషనర్లు వివరించారు. ఇందులో రూ.902 కోట్లకుపైగా షెల్ కంపెనీలు, అనామక వ్యాపారులు, గుర్తుతెలియని బ్యాంక్ ఖాతాలు, మోసపూరిత లావాదేవీల ద్వారా మళ్లించారని 2018 ఫోరెన్సిక్ ఆడిట్లో తేలిందని చెప్పారు.