న్యూఢిల్లీ, ఆగస్టు 29: అదానీ-హిండెన్బర్గ్ కేసులో మార్కెట్ రెగ్యులేటర్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్పై సుప్రీం కోర్టు విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ బెంచ్ ఆర్టికల్ 370పై పిటిషన్లను విచారిస్తున్న నేపథ్యంలో అదానీ-హిండెన్బర్గ్ కేసు విచారణ వాయిదా పడిందన్న వార్తలు వెలువడ్డాయి. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ చేసిన దర్యాప్తుపై స్టాటస్ రిపోర్ట్ను ఆగస్టు 25న మార్కెట్ రెగ్యులేటర్ సుప్రీం కోర్టుకు సమర్పించింది.
అదానీ గ్రూప్లో పెట్టుబడి చేసిన పలు సంస్థలు పన్ను స్వర్గధామాలైన దేశాల్లో ఉన్నందున, 12 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) షేర్హోల్డింగ్ను నిర్ధారించడం దర్యాప్తులో సవాలుగా మారిందని సెబీ పేర్కొంది. ఆయా విదేశీ ఇన్వెస్టర్ల వెనుకనున్న వాస్తవ లబ్దిదారులను గుర్తించడానికి ఐదు పన్ను రహిత దేశాల నుంచి అందే సమాచారం కోసం వేచిచూస్తున్నామని సుప్రీం కోర్టుకు సెబీ తెలిపిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.