Jet Airways | రుణాల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ను బిడ్లో దక్కించుకున్న జలాన్-కల్రాక్ కన్సార్టియం చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్, గ్రాట్యూటీ బకాయిలను చెల్లించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ జలాన్-కల్రాక్ కన్సార్టియం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్లు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
సంస్థ పునరుద్ధరణలో జెట్ ఎయిర్వేస్ సిబ్బంది వేతన బకాయిల చెల్లింపు కూడా భాగమే. అవి రూ.200 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. రుణాల ఊబిలో చిక్కుకున్న ఏదైనా ఎయిర్లైన్స్ పునరుద్ధరణకు ముందుకు వచ్చే సంస్థ ఏదైనా కార్మికులు, సిబ్బంది బకాయిలు చెల్లించాలన్న సంగతి తెలుసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. `కార్మికుల వేతన, పీఎఫ్, గ్రాట్యూటీ బకాయిలు చెల్లించడమే ఫైనల్. మేం అందులో తలదూర్చం` అని స్పష్టం చేసింది.
2019 జూన్లో దివాళా ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ప్రావిడెండ్ ఫండ్, గ్రాట్యూటీ చెల్లించాలని తీర్మానించారు. దివాళా ప్రక్రియలో సిబ్బంది, గ్రాట్యూటీ బకాయిలు రూ.276 కోట్లు చెల్లించాల్సిందేనని తీర్మానించినందున ఆ మేరకు నెల రోజుల్లో చెల్లించాలని జలాన్-కల్రాక్ కన్సార్టియంను ఎన్సీఏల్ఏటీ గత అక్టోబర్ 21న ఆదేశించింది. దీన్ని జలాన్-కల్రాక్ కన్సార్టియం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదిలా ఉంటే దివాళా ప్రక్రియ తీర్మానానికి వ్యతిరేకంగా జలాన్-కల్రాక్ కన్సార్టియం వ్యవహరిస్తుందని జెట్ ఎయిర్వేస్ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులు ఈ నెల 24న ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ దాఖలు చేశాయని సమాచారం.