న్యూఢిల్లీ, నవంబర్ 18: రెండు దశాబ్దాల క్రితం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జడ్ఎల్) డిజిన్వెస్ట్మెంట్పై సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయనుంది. ఈ వాటా విక్రయం కేసును తాజాగా రిజిష్టర్ చేసుకుని, అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని గురువారం దర్యాప్తు సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2002లో జరిగిన హెచ్జడ్ఎల్ డిజిన్వెస్ట్మెంట్పై సీబీఐ అధికారులు, ప్రాసిక్యూటర్ల నివేదికలు, సిఫార్సులు పరిశీలించిన మీదట రెగ్యులర్ కేసుగా రిజిష్టర్ చేసేందుకు ప్రాధమిక ఆధారాలు కన్పించాయని జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ పేర్కొంది. 1997-2003 మధ్యకాలంలో ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మెజారిటీ వాటాను విక్రయించే ప్రక్రియ జరిగింది. దీనిపై సీబీఐ 2013లో కేసు రిజిష్టర్ చేసినప్పటికీ, 2017లో కేసును మూసేసింది. ఈ డిజిన్వెస్ట్మెంట్లో మూడు ప్రధానమైన అవకతవకల్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. అవి…
హెచ్జడ్ఎల్లో ప్రభుత్వానికి 75.92 శాతం వాటా ఉండగా, 25 శాతానికి మించకుండా వాటా విక్రయించాలని, మెజారిటీ వాటా ప్రభుత్వమే అట్టిపెట్టుకోవాలని 1997 డిసెంబర్లో డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ సిఫార్సుచేసింది. 1999 జూలైలో డిజిన్వెస్ట్మెంట్ క్యాబినెట్ కమిటీ (సీసీడీ) 25 శాతం వాటా విక్రయ సిఫార్సును ఆమోదించింది. కానీ 2000లో డిజిన్వెస్ట్మెంట్పై ఏర్పాటైన కార్యదర్శుల గ్రూప్ ఈ సిఫార్సును పక్కనపెట్టి, ఎటువంటి కారణాన్ని చూపకుండానే 26 శాతం వాటా అమ్మకానికి సిఫార్సుచేసింది. అటుతర్వాత కార్యదర్శుల గ్రూప్ సిఫార్సును సీసీడీ ఆమోదించింది. 25 శాతానికి బదులు, 26 శాతం వాటాను వ్యూహాత్మక ఇన్వెస్టరుకు విక్రయించి, కంపెనీ యాజమాన్య నిర్వహణను అప్పగించాలని నిర్ణయించింది.
2001లో హెచ్జడ్ఎల్ విక్రయానికి బిడ్డింగ్లో షేరుకు రూ.35,90 రిజర్వ్ ధరగా సంబంధిత కమిటీ నిర్ణయించింది. తుది బిడ్డింగ్కు ఆరు సంస్థలు అర్హత సాధించగా, అనిల్ అగర్వాల్ (వేదాంత గ్రూప్ అధిపతి)కు చెందిన స్టెరిలైట్ వెంచర్స్ నుంచి మాత్రమే రూ.29.22 ధరకు బిడ్ వచ్చింది. ఇది రిజర్వ్ ధరకంటే తక్కువగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడేంతవరకూ టెండరు ప్రక్రియను నిలుపుచేయాలని కమిటీ 2001 నవంబర్ 8న సిఫార్సుచేసింది. ఆ మరుసటి రోజే నవంబర్ 10న ఆ సిఫార్సును తిరస్కరించారు. 2002 మార్చిలో రెండోదఫా బిడ్స్ను ఆహ్వానించి షేరుకు రూ.32.15 రిజర్వ్ ధరగా నిర్ణయించారు. రిజర్వ్ ధరను తగ్గించినా, గతంలో అర్హత పొందిన ఆరుగురు బిడ్డర్లనే ఆహ్వానించారు తప్ప, కొత్తగా ఓపెన్ బిడ్డింగ్ జరపలేదు. చివరకు షేరుకు రూ.40.51 ధర చొప్పున రూ. 445 కోట్లకు హెచ్జడ్ఎల్ వాటాను స్టెరిలైట్కు విక్రయించారు.
అసెట్ వాల్యూయర్, గ్లోబల్ అడ్వయిజర్లు కంపెనీ ఆస్తుల్ని కరెక్టుగా విలువకట్టలేదని, 2002లో మరో 18.92 శాతం వాటాను పాత ధరకే విక్రయించారని, దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 650 కోట్ల నష్టం వాటిల్లినట్లు 2006 కాగ్ నివేదిక వెల్లడించింది. 2002 కంపెనీ షేరు స్టాక్ మార్కెట్లో రూ. 119 వద్ద ట్రేడవుతుండగా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్కు గత బిడ్డింగ్ ధర రూ.40.51తోనే మరో 18.92 శాతం వాటాను విక్రయించారు. అలాగే ఈ డిజిన్వెస్ట్మెంట్కు బీఎన్పీ పారిబాను గ్లోబల్ అడ్వయిజర్గా నిర్ణయించగా, గతంలో సీబీఐ ప్రాధమిక విచారణ సందర్భంగా ఆ గ్లోబల్ అడ్వయిజర్కు ప్రాతినిధ్యం వహించే అధికారుల ఆచూకీ లభ్యం కాలేదు.