Vijay Mallya | పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్మాల్యపై 2017-కోర్టు ధిక్కార కేసుపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పనున్నది. న్యాయస్థానానికి సమాచారం తెలియకుండా దాచి పెట్టినందుకు ఆయనపై కోర్టు ధిక్కారకేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్లు యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం గత మార్చి 10న తీర్పు రిజర్వు చేసింది.
న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి తన పిల్లల పేరిట 40 మిలియన్ల డాలర్ల ఆస్తులను విజయ్ మాల్య బదిలీ చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని పలు దఫాలు న్యాయస్థానం ఆదేశించినా ఆయన హాజరు కాలేదు. ప్రస్తుతం విజయ్ మాల్య ఆర్థిక నేరాల కేసులోనే లండన్లో ఉన్నాడు. భారత్కు విజయ్ మాల్య అప్పగింత పిటిషన్పై లండన్ న్యాయస్థానంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.
చివరిసారిగా రెండు వారాల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరి 10న దేశ అత్యున్నత న్యాయస్థానం అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు. ఆస్తులు బదిలీ చేయొద్దని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించొద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి.