IT Abolition | బీజేపీ ఎంపీ, ఆర్థికవేత్త సుబ్రమణ్యస్వామి ఆదాయం పన్నుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహించడానికి పూర్తిగా ఆదాయం పన్నును రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించారు. కనీసం సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే వరకైనా రద్దు చేయాలని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చేనెల ఒకటో తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తలమునకలై ఉన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో మందులు, వైద్య పరికరాల ధరలు పెరిగి లక్షల మంది ప్రజలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని సుబ్రమణ్య స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి రిలీఫ్ కలిగించేందుకు కనీసం సాధారణ పరిస్థితులు నెలకొనే వరకైనా ఆదాయం పన్ను రద్దు చేయాలని కోరారు. తాను ఆర్థిక మంత్రినైతే.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఏ ఒక్కరూ ఆదాయం పన్ను చెల్లించనవసరం లేకుండా చర్యలు తీసుకునే వాడిని. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తిరిగి ఆదాయం పన్ను వసూలు చేయొచ్చునని సుబ్రమణ్యస్వామి చెప్పారు.
ఆదాయం పన్ను రద్దు చేయాలన్న తన ప్రతిపాదనను స్వామి సమర్థించుకున్నారు. ఆదాయం పన్నుతోపాటు ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రత్యామ్నాయ వనరులు ఉన్నాయన్నారు. 2013లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం కేవలం రూ.4 లక్షల కోట్లు మాత్రమే ఐటీ ద్వారా ఆదాయం పొందింది. ఇప్పుడు రూ. 8-9 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. 2జీ స్పెక్ట్రం వేలంతో రూ.4 లక్షల కోట్ల ఆదాయం పొందొచ్చు. బొగ్గు గనుల వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చునన్నారు. రెవెన్యూ పెంచుకోవడానికి ప్రభుత్వానికి వనరుల కొరత లేదన్నారు.