న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత జీడీపీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే దీనిపై సొంత పార్టీకి చెందిన సుబ్రమణ్యన్ స్వామి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్వో) అందించిన వివరాల ప్రకారమే ఐఎంఎఫ్ ఈ ప్రకటనలు చేస్తుంది. అయితే పాపం అమిత్ షాకు ఇది కూడా తెలియట్లేదని, బహుశా జంతుశాస్త్రంలో పట్టభద్రులు కావడం వల్లేనేమో ఆర్థిక శాస్త్రంపై అవగాహన అంతంతమాత్రంగా ఉండిపోయిందన్నట్టు సదరు పోస్ట్లో కనిపిస్తున్నది. దీంతో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యన్ స్వామి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఎక్స్లో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నది. గురువారం రాత్రి నాటికే దీన్ని 5 లక్షల మందికిపైగా చూసినట్టు తెలుస్తున్నది.