న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: నిధుల కోసం వెంపర్లాడుతున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి, బడ్జెట్లో నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరడానికి ఎల్ఐసీ ప్రతిష్టను మసకబార్చింది. ఇన్వెస్టర్లను తీవ్రంగా నష్టపర్చింది. రష్యా-ఉక్రెయిన సంక్షోభంతో ప్రపంచమంతటా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు వెనుకంజవేస్తున్న సమయంలో ఎల్ఐసీ పేరుచెప్పి దేశీ రిటైల్ మదుపరులను కేంద్ర ప్రభుత్వం ఆకర్షించి భారీ నిధుల్ని సమీకరించింది. తన అధీనంలోని ఆర్థిక సంస్థల్ని, ఫండ్స్తో ఆర్థిక శాఖ పెట్టుబడులు పెట్టించింది. షేరుకు రూ.949 ధరతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 3.5 శాతం వాటాల్ని 2022 మే నెలలో విక్రయించి రూ.21,000 కోట్లు తన ఖాజానాలో వేసుకుంది. ఐపీవో ధర కంటే తక్కువకు రూ.872 వద్ద లిస్టయిన ఎల్ఐసీ షేరు రూ.920 గరిష్ఠస్థాయిని మాత్రమే చూసింది. కేవలం నాలుగు నెలల్లోనే మూడో వంతు విలువను కోల్పోయింది. మంగళవారం బీఎస్ఈలో ఇది రూ.629 వద్ద ముగిసింది. భారీ ఐపీవోలకు మార్కెట్ సిద్ధంగా లేని సమయంలో ఐపీవోను తీసుకురావాలన్న తొందరపాటే ఎల్ఐసీ విలువను దెబ్బతీసిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. భారీ నిధుల ఆశతో అధిక ధరతో ప్రభుత్వం ఐపీవోకు రావడం సైతం షేరు ధరను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికే లిస్టయిన ఇతర ప్రైవేట్ రంగ బీమా సంస్థలకంటే ఎక్కువ ధరతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీచేశారని జీసీఎల్ సెక్యూరిటీస్ సీఈవో రవి సింఘాల్ అన్నారు.
తగ్గిన సంస్థ విలువ
రూ. 6 లక్షల కోట్ల విలువతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను తీసుకొచ్చారు. ఇప్పుడా సంస్థ విలువ రూ.3.98 లక్షల కోట్లకు తగ్గిపోయింది. లిస్టింగ్ తర్వాత మార్కెట్లో అత్యంత విలువైన మూడు కంపెనీల్లో ఒకటిగా ఎల్ఐసీ ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఊదరగొట్టారు. ప్రస్తుతం ఇది మార్కెట్ విలువలో 14వ స్థానంలో ఉంది. దశాబ్దాలుగా ప్రజల జీవితంలో భాగమైపోయిన ఎల్ఐసీ ప్రతిష్ఠకు కేంద్ర ఆనాలోచిత చర్యలతో దెబ్బతగిలింది.
ఇన్వెస్టర్ల సంపద ధ్వంసం
ప్రపంచ చమురు దిగ్గజం సౌదీఆరామ్కో తరహాలో భారత్ ఇన్వెస్టర్లకు ఎల్ఐసీ లిస్టింగ్ ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసి, నిధులు లాగేసుకుని వారి సంపదను ధ్వంసం చేసింది. ఎల్ఐసీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు చేసిన చేసిన రూ.21,000 కోట్ల పెట్టుబడి కాస్తా 33.72 శాతం తరిగిపోయింది. రూ.7,000 కోట్ల మదుపరుల సంపద హరించుకుపోయింది. కేంద్రం ఎల్ఐసీని హడావుడిగా లిస్ట్ చేసిన తరుణంలో ప్రపంచానికి ద్రవ్యోల్బణం షాక్ తగిలిందని, భారత్ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోతున్నారని రూపాయి క్షీణబాట పట్టిందని షేర్ఇండియా వైస్ ప్రెసిడెంట్ రవిసింగ్ చెప్పారు. ప్రభుత్వం తొందరపాటు చర్య ఇన్వెస్టర్ల సంపదను దెబ్బతీసిందన్నారు.