Stocks in Green | కార్పొరేట్లకు పలు రకాల తీపి వార్తలు చెప్పడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పైపైకి దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12.40 గంటల సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 907.91 పాయింట్లు లాభ పడి 58,922.08 పాయింట్లకు చేరుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 247.25 పాయింట్లు గెయిన్తో 17,587 పాయింట్లకు దూసుకెళ్లింది. సెన్సెక్స్ 1.56 శాతం నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్లో 1.43 శాతానికి పైగా లాభాలు గడించాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లకు తీపి కబురు అందించారు. కార్పొరేట్ సర్చార్జీ 12 నుంచి ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆమె లోక్సభలో 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్పొరేట్ ప్రపంచానికి సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తున్నారు.
లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ మీద సర్చార్జీ గరిష్టంగా 15 శాతం విధించారు. ఇక స్టార్టప్ సంస్థలు స్థాపించే వారికి పన్ను మినహాయింపులు 2023 మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్పీఎస్ ఖాతాల్లో ఉద్యోగుల వాటాపై పన్ను మినహాయింపు 14 శాతానికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.