Singareni | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫరా జరిగేలా కనీసం 5 లక్షల టన్నుల బొగ్గును స్టాక్గా పెట్టుకోవాలని ఏరియాల వారీగా అధికారులను కంపెనీ సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై బుధవారం సింగరేణిభవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలు, అడ్వైజర్లు, డైరెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ నెలలో ప్రతిరోజూ కనీసం 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.95 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని, 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఓబీ లక్ష్యాలను సాధించని కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడ్రియాల లాంగ్వాల్ భూగర్భ గనిలో తరచూ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా వెళ్లాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023 -24) చివరికల్లా కనీసం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని దాటాలన్నారు.