ముంబై, జూన్ 7: రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష కంటే ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజు దేశీ య స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ పరపతి సమీక్షలో మరోసారి వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉన్నదని సంకేతాలు మదుపరుల్లో అందోళనను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను భారీగా తరలించుకుపోవడం, రూపాయి పతనం కూడా మార్కెట్ల పతనానికి పరోక్షంగా కారణమైంది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 567.98 పాయింట్లు లేదా 1.02 శాతం తగ్గి 55,107.34 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 153.20 పాయింట్లు(0.92 శాతం) తగ్గి 16,415.35 వద్ద స్థిరపడింది.
2 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మంగళవారం ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2,08,291.75 కోట్లు తగ్గి రూ.2,54,33,013.63 కోట్లకు జారుకున్నది. వరుసగా మూడు రోజుల్లో మదుపరులు ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.
టాప్ లూజర్గా టైటాన్
టాటా గ్రూపునకు చెందిన టైటాన్ షేరు 4.48 శాతం క్షీణించి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు డాక్టర్ రెడ్డీస్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, నెస్లె ఇండియాలు కూడా మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. 30 షేర్ల ఇండెక్స్లో కేవలం ఐదు మాత్రమే పెరిగాయి. ఎన్టీపీసీ, మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్లు రెండు శాతం వరకు పెరిగాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లకు అదరణ లభించలేదు. కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెక్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.