Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) లాభాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్లైన (PSUs) బ్యాంకింగ్, హెల్త్కేర్ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోష్ కనిపించింది. ఈ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సానుకూలంగా ముగిశాయి. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court) ఇచ్చిన తీర్పుతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు బలాన్ని ఇచ్చింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 479.95 పాయింట్లు పెరిగి 83,294.66 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 141.75 పాయింట్లు లాభపడి 25,713 వద్ద ముగిసింది. సెన్సెక్స్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్ 2.82 శాతం లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా లాభపడ్డాయి. మరోవైపు టెక్నాలజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి. వీటితోపాటు ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ లిమిటెడ్ షేర్లు కూడా నష్టపోయాయి. ఇక రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.36 శాతం, నిఫ్టీ మిడ్స్మాల్ హెల్త్కేర్ ఇండెక్స్ 1.03 శాతం మేర పెరిగాయి. అయితే, నిఫ్టీ ఐటీ సూచీ నష్టాలతో ముగిసింది.
అదేవిధంగా బ్రాడర్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం లాభంతో ముగిసింది. మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీకి తక్షణ ప్రతిఘటన 25,800 వద్ద, కీలక మద్దతు 25,500 వద్ద కొనసాగుతోంది.