న్యూఢిల్లీ, జూన్ 7: స్టాక్ మార్కెట్లకు షాక్ అబ్జార్బర్స్ రిటైల్ ఇన్వెస్టర్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపుల్ని తగ్గించేది వారేనని చెప్పారు. మంగళవారం ఇక్కడ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు వాటిని శోషించుకునే షాక్ అబ్జార్బర్లుగా కనిపిస్తున్నారని చెప్పారు. ఇదిలావుంటే డిజిటైజేషన్ విస్తరిస్తున్న నేపథ్యంలో రెగ్యులేటర్లు అన్నిరకాలుగా మరింతగా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, సింగిల్ నోడల్ ఏజెన్సీ డ్యాష్బోర్డ్తో పరిపాలన ఇంకా పారదర్శకంగా మారగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.