ముంబై, మార్చి 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 361.64 పాయింట్లు లేదా 0.50 శాతం పడిపోయి 72,470.30 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 468.91 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 92.05 పాయింట్లు లేదా 0.42 శాతం కోల్పోయి 22,004.70 వద్ద నిలిచింది. దీంతో వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినైట్టెంది. నిజానికి ఉదయం ఆరంభం నుంచీ సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. కాగా, హెవీ వెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల్లో అమ్మకాల ఒత్తిడి నష్టాలను పెంచినట్టు మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. రిలయన్స్ షేర్ విలువ 0.88 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.11 శాతం చొప్పున పతనమయ్యాయి. రంగాలవారీగా టెక్నాలజీ, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్లు 0.83 శాతం నుంచి 0.26 శాతం మేర దిగజారాయి.