Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. వరుసగా మూడో సెషన్లోనూ లాభాలు పొందడం విశేషం. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు లాభపడ్డాయి. హార్ముజ్ జలసంధి తెరిచి ఉంచడం, ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం మార్కెట్కు లాభాలు తెచ్చిపెట్టాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 544.15 పాయింట్లు లాభపడి 76,808.48 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 135.25 పాయింట్లు లాభపడి, 23,989.15 పాయింట్ల వద్ద ముగిసింది. 24,000 మార్క్కు నిఫ్టీ దాదాపు 11 పాయింట్ల దూరంలో నిలిచిపోయింది. గత మూడు సెషన్లు కలిపి సెన్సెక్స్ 4 శాతం, నిఫ్టీ 3.6 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.57 శాతం తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 81.03 డాలర్ల వద్ద ట్రేడయింది. అలాగే, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర కూడా 2.71 శాతం తగ్గింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 78.56 డాలర్ల వద్ద కొనసాగింది. ఆసియా మార్కెట్లు కూడా మంగళవారం 0.8 శాతం లాభాలు పొందాయి. రూపాయి కూడా స్వల్పంగా లాభపడింది. డాలర్తో రూపాయి విలువ 94.6 వద్ద కొనసాగింది. బీఎస్ఈ30 సూచీలో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్తాన్ యునీలీవర్ లాభాలు పొందాయి. వీటిలో అత్యధికంగా హెచ్సీఎల్ టెక్ సంస్థ షేర్లు 3.59 శాతం పెరిగాయి.
మరోవైపు మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్, టాటా స్టీల్, ఇండిగో సంస్థల షేర్లు నష్టపోయాయి. ఇండిగో షేర్లు 0.86 శాతం నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్30 సూచీలో 21 కంపెనీలు లాభాలు పొందగా, 9 సంస్థలు నష్టపోయాయి. శుక్రవారం నుంచి హార్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందనే ప్రకటన, ఇరాన్తో శాంతి ఒప్పందం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు సానుకూల ఫలితాలు తీసుకొచ్చాయి.