Stock markets : పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇవాళ్టి ట్రేడింగ్లో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇరాన్ (Iran) పై అమెరికా (USA) తన సైనిక చర్యను తీవ్రతరం చేసిందనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. రోజంతా ఒడుదొడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ (Sensex) 150.63 పాయింట్లు నష్టపోయి 73,832.55 వద్ద, నిఫ్టీ (Nifty) 53.35 పాయింట్లు తగ్గి 23,161.60 వద్ద ముగిశాయి.
ఇరాన్కు తగినంత సమయం ఇచ్చినా చర్చలకు రాలేదని, ఇప్పుడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై తీవ్రంగా దాడి చేస్తామని ఆయన స్పష్టం చేయడంతో మార్కెట్లలో ఆందోళన పెరిగింది. దీనికి తోడు అమెరికా దాడుల తర్వాత వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది. ఈ పరిణామంతో ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలుగవచ్చని, ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈరోజు ట్రేడింగ్లో బ్రాడర్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మరింత ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.81 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.67 శాతం చొప్పున పతనమయ్యాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్, కెమికల్ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ మీడియా, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు మార్కెట్లకు మద్దతుగా నిలిచి నష్టాలను కొంతమేర తగ్గించాయి. మరోవైపు డాలర్కు పెరిగిన డిమాండ్ కారణంగా రెండు రోజుల లాభాల తర్వాత రూపాయి విలువ పడిపోయింది.