ముంబై, మార్చి 15: దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో వరుసగా ఐదోరోజు బుధవారం దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. బ్యాంకిం గ్ రంగ షేర్లలో క్రయ విక్రయాలు జోరుగా సాగాయి. ఈక్విటీ మార్కెట్లో నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో సెన్సెక్స్ ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 344.29 పాయింట్లు తగ్గి 57,555.90 వద్దకు జారుకున్నది. 30 షేర్ల సూచీల్లో 21 నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీకి ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు చివరి గంటలో నష్టాల్లోకి జారుకునేటట్టు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 71.15 పాయింట్లు తగ్గి 16,972.15 వద్ద ముగిసింది.