Stocks | సోమవారం ఉదయం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మధ్యాహ్నం బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వు మరోమారు కీలక వడ్డీరేట్లు పెంచనున్నదన్న భయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా ఐటీ, ఆటో మినహా అన్ని సెక్టార్ల షేర్లపై అమ్మకాల ఒత్తిడితో సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఉదయం 61,112 పాయింట్లతో లాభాల్లో మొదలైంది. ఇంట్రా డే ట్రేడింగ్లో 61,290 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 311 పాయింట్లు (0.5 శాతం) నష్టపోయి 60,692 పాయింట్లతో సరిపెట్టుకున్నది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 సైతం 100 పాయింట్ల పతనం (0.56 శాతం)తో 17,845 పాయింట్ల వద్ద స్థిర పడింది.
మారుతి సుజుకి, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్ల్టే ఇండియా, రిలయన్స్ స్క్రిప్ట్లు 1-1.4 శాతం నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఇక అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆరు శాతం వరకు నష్టపోయింది.
టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ స్టాక్స్కు కొనుగోలుదారుల నుంచి కొంత మద్దతు లభించింది. సిప్లా ఫార్మా స్క్రిప్ట్ బీఎస్ఈలో ఇంట్రా డే ట్రేడింగ్లో ఏడు శాతం అంటే రూ.956.20 నష్టపోయింది. ఉత్తరాఖండ్లోని సిప్లా ఫార్మా యూనిట్లో తనిఖీల తర్వాత యూఎస్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) ఎనిమిది అభ్యంతరాలతో కూడిన 483 ఫామ్ జారీ చేసిన ఫలితం నెగెటివ్గా నిలిచింది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.12 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ఫైనాన్సియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ ఇండెక్స్లు 0.9 శాతం చొప్పున పతనం అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం 0.54 శాతం లబ్ధితో ముగిసింది.