Stock Markets | ముంబై, జూలై 21: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల దన్నుతో వరుసగా ఆరు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన సూచీలకు ఇన్ఫోసిస్ గండికొట్టింది. ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండనున్నదని గైడెన్స్ను విడుదల చేయడంతో మదుపరుల్లో టెన్షన్ నెలకొన్నది. దీంతో సెల్లింగ్ బటన్ నొక్కడంతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి. ఇన్ఫీ దెబ్బకు సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 887.64 పాయింట్లు లేదా 1.31 శాతం నష్టపోయింది. చివరకు 66,684.26 వద్ద ముగిసింది. గత నాలుగు నెలల్లో ఒక్కరోజు ఇంతటి స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 1,038.16 పాయింట్లు లేదా 1.53 శాతం నష్టపోయి 66,533.74 వద్దకు జారుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 234.15 పాయింట్లు(1.17 శాతం) కోల్పోయి 19,745 వద్ద ముగిసింది. మార్కెట్లు భారీ నష్టాలతో మదుపరులు భారీగా సంపదను కోల్పోయారు. ఏకంగా రూ.2 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు.
ఇన్ఫోసిస్ దెబ్బకు ఐటీ రంగ షేర్లు కుదేలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాప్5 సంస్థలు అంచనాలకు తగ్గట్టుగా రాణించినప్పటికీ గైడెన్స్ మాత్రం నిరాశాజనకంగా ఉండనున్నట్లు అంచనా విడుదల చేయడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది. ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్తోపాటు టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, హెచ్సీఎల్, విప్రో, టీసీఎస్, రిలయన్స్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టైటాన్, మారుతిలు నష్టపోయాయి.
ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్టెల్, సన్ఫార్మా, పవర్గ్రిడ్లు లాభపడ్డాయి.
గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 2,178 పాయింట్లు(2.86 శాతం), నిఫ్టీ 594 పాయింట్లు(3.84 శాతం) పెరిగిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం కూడా సూచీల పతనానికి పరోక్షంగా కారణమయ్యాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గి 29,547.28 పాయింట్లకు జారుకోగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 34,146.66 పాయింట్లకు పడిపోయింది.
రంగాలవారీగా చూస్తే ఐటీ రంగ షేర్లు అత్యధికంగా 4.40 శాతం వరకు నష్టపోయాయి. దీంతోపాటు టెక్నాలజీ షేర్లు 3.91 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.09 శాతం, ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి.
కానీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, టెలి కమ్యూనికేషన్స్ రంగ షేర్లు కదంతొక్కాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 1.19 శాతం పెరిగి 80.59 డాలర్లకు చేరుకున్నది.
ఇన్ఫోసిస్ షేరు కుప్పకూలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాను తగ్గించడంతో కంపెనీ షేరు ఏకంగా 8 శాతం పడిపోయింది. ఒక దశలో 10 శాతం వరకు నష్టపోయిన షేరు చివరకు 8.18 శాతం నష్టంతో రూ.1,330.40 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేరు 7.73 శాతం తగ్గి రూ.1,337.45 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.49,159.03 కోట్లు కరిగిపోయి రూ.5,52,141.59 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ అంచనాకు చేరుకోకపోవడం, రెవెన్యూ గైడెన్స్ 1-3.5 శాతం మాత్రమే వృద్ధిని సాధించనున్నట్లు అంచనా విడుదల చేయడం మదుపరులకు రుచించలేదు.
‘ఇన్ఫోసిస్ బలహీన గైడెన్స్ మొత్తం ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్లూచిప్ సంస్థల షేర్లు బేర్స్ గుప్పిట్లోకి జారుకోవడం సూచీల వరుస ర్యాలీకి బ్రేక్పడినట్లు అయింది’
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్