ముంబై, మార్చి 5: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు నిరాశావాదంగా ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను తరలించుకుపోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడానికి ప్రధాన కారణమని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 195.16 పాయింట్లు నష్టపోయి 73,677.13 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 49.30 పాయింట్లు కోల్పోయి 22,356.30 వద్ద నిలిచింది. వరుస లాభాలతో సోమవారం రికార్డు స్థాయికి చేరుకున్న ఇరు సూచీలు వెనక్కి తగ్గాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. గత నాలుగు సెషన్లలో సూచీ రెండు శాతానికి పైగా లాభపడిన విషయం తెలిసిందే.