ముంబై, ఫిబ్రవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరోరోజూ కొనుగోళ్ల మద్దతును కూడగట్టుకున్నాయి. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ మరో సరికొత్త స్థాయిని అధిరోహించింది. అటు క్లోజింగ్, ఇటు ఇంట్రా-డేల్లోనూ ఆల్టైమ్ హై రికార్డులను నెలకొల్పింది. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు తడబడినా.. ఆఖర్లో మెప్పించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 349.24 పాయింట్లు లేదా 0.48 శాతం ఎగబాకి 73,057.40 వద్ద నిలిచింది. నిఫ్టీ 74.70 పాయింట్లు లేదా 0.34 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 22,196.95 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 22,215.60 స్థాయిని తాకి లైఫ్టైమ్ ఇంట్రా-డే హైని లిఖించింది. మొత్తానికి గడిచిన 6 రోజుల్లో సెన్సెక్స్ 1984 పాయింట్లు, నిఫ్టీ 580 పాయింట్లు పెరిగాయి.
రంగాలవారీగా..
బీఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లు 1.23 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత రియల్టీ 1.13 శాతం, ఆర్థిక సేవలు 0.87 శాతం, యుటిలిటీస్, చమురు-గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు 0.66 శాతం మేర పెరిగాయి. అయితే మిడ్క్యాప్ సూచీ 0.17 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.18 శాతం చొప్పున నష్టపోయాయి. షేర్లవారీగా చూస్తే.. పవర్గ్రిడ్ అత్యధికంగా 4.16 శాతం పుంజుకున్నది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కొటక్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లూ పెద్ద ఎత్తునే పెరిగాయి. ఎన్టీపీసీ, నెస్లే, హెచ్యూఎల్ షేర్లూ లాభపడ్డాయి. అయినప్పటికీ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు క్షీణించాయి. కాగా, బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.391.50 లక్షల కోట్లు (4.72 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నది.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి. జపాన్ సూచీ నష్టపోయింది. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) రూ.754.59 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్ గణాంకాలు చెప్తున్నాయి. ‘బ్యాంకింగ్ షేర్లు ఇటీవలి కాలంలో దిద్దుబాటుకు లోనయ్యాయి. కానీ ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి. ఇది స్టాక్ మార్కెట్ల లాభాలకు దోహదం చేసింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.