Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైతం మానిటరీ పాలసీ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్లో ర్యాలీ సాగింది. ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచగా.. వారం చివరి రోజున సెన్సెక్స్ 1017 పాయింట్లు ఎగిసి 57,427 పాయింట్ల వద్ద.. అదే సమయంలో నిఫ్టీ కూడా 276 పాయింట్లు లాభపడి 17,094 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపీసీ మూడు రోజుల సమావేశం అనంతరం రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో రెపోరేటు 5.4శాతం నుంచి 5.90శాతానికి పెరిగింది.
ఆర్బీఐ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల పెంపు ఆశించిన స్థాయిలోనే ఉండడంతో సూచీలు లాభాల బాటపట్టగా.. ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లయ్యింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆటో, రియల్టీ రంగాల షేర్లు పుంజుకున్నాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్తో పాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 25 షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.