Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తోంది. శుక్రవారం (2023 సెప్టెంబర్ 15) దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైం గరిష్ట రికార్డులు నమోదు చేశాయి. ఉదయం నుంచి ట్రేడింగ్ సానుకూలంగా సాగింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 67,927 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 20,222 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. తదుపరి ట్రేడింగ్ ముగిసే సమయానికి 319.63 పాయింట్ల లబ్ధితో 67,838.63 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీ 89.25 పాయింట్ల లాభంతో 20,192.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్లో కీలక దశ సెన్సెక్స్ 67,900, నిఫ్టీ 20,200 పాయింట్ల మైలురాయిని దాటేశాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.83.18 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో ఆటో, పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ సారధ్యంలో మార్కెట్ ర్యాలీ సాగింది. నిఫ్టీలో బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ లబ్ధి పొందగా, బీపీసీఎల్ స్టాక్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ వరుసగా 11వ రోజు లాభాలతో సాగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ భారీగా లబ్ధి పొందగా, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నష్టపోయింది.
బజాజ్ ఆటో 6.3 శాతం, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, హెచ్సీఎల్ టెక్, ఎచిర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ టైఫ్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ పైపైకి దూసుకెళ్లాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, ఐటీసీ, ఎల్ అండ్ టీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.09, స్మాల్ క్యాప్ 0.3 శాతం లబ్ధితో ముగిశాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 1.6 శాతం,ఐటీ ఇండెక్స్ 0.9 శాతం లాభం పొందాయి.