ముంబై, జూన్ 23 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. గత ఐదు రోజులుగా భారీగా పుంజుకున్న సూచీలు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుపోవడం, ఐటీ, మెటల్ రంగ షేర్లలో అమ్మకాలు జరుగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపర్లను నష్టాలవైపు నడిపించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టపోయి 76,200.68 వద్దకు జారుకున్నది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం కోల్పోయి 23,824.10 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5.77 లక్షల కోట్లు కరిగిపోయి రూ.474 లక్షల కోట్లకు పడిపోయింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపర్లలో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక్కసారిగా కుప్పకూలాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఏఐ టెక్నాలజీ దూసుకుపోతుండటంతో ఐటీ రంగ షేర్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందన్నారు. ఈ నెల 11 నుంచి ఇప్పటి వరకు నాలుగు శాతానికి పైగా ఎగబాకిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రూపాయి మరింత బలహీనం కావడం కూడా సూచీల పతనానికి ఆజ్యంపోసిందన్నారు.
రూపాయి పతనం కొనసాగుతున్నది. గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్లో అనూహ్యంగా డాలర్కు డిమాండ్ ఊపందుకోవడంతో ఇతర కరెన్సీలు ఢీలాపడ్డాయి. ఈ క్రమంలో దేశీయ కరెన్సీ విలువ కూడా మంగళవారం 13 పైసలు కోల్పోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.76 వద్ద ముగిసింది. ఉదయం 94.73 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు 94.63-94.92 స్థాయిలో కదలాడింది. సోమవారం కూడా రూపాయి 30 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.