Investers Wealth | గత ఐదు సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడంతో ఇన్వెస్టర్ల పంట పండింది. ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లకు రూ.9.76 లక్షల కోట్ల సంపద చేకూరింది. గత శుక్రవారం నుంచి గురువారం ముగిసిన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,265.8 పాయింట్లు లాభ పడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,76,749.78 కోట్లు పెరిగి రూ.2,60,42,730.43 కోట్లకు చేరుకున్నది. ఇక గురువారం ముగిసిన ట్రేడింగ్ లో సెన్సెక్స్ 284.42 పాయింట్లు లబ్ధి పొంది 55,681.95 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ.1780.94 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ పై 3.58 శాతం తగ్గుముఖం పట్టి 103.2 డాలర్లకు పడిపోయింది.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో, పవర్ గ్రిడ్ గురువారం ట్రేడింగ్లో లాభ పడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 7.88 శాతం లాభంతో ముగిసింది. ఇక రెడ్డీస్ ల్యాబ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టపోయాయి.
అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు తొలగిపోవడం, దేశీయంగా నైరుతి రుతు పవనాల రాకతో వర్షాలు కురవడం, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలతో వరుసగా ఐదో సెషన్ లో మార్కెట్లు పుంజుకున్నాయని మెహతా ఈక్విటీస్ ఉపాధ్యక్షుడు (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాల్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులు పెట్టారని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (రిటైల్) ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.