Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. బుధవారం స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పవనాలతో.. దేశీయ మార్కెట్లలో బుధవారం భారీగా అమ్మకాలు కనిపించాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు తగ్గి 67వేల మార్క్ దిగువకు పడిపోయింది. ట్రేడింగ్లో 66,728 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 238 పతనమై 19,895 పాయింట్లకు చేరుకుంది.
చివరకు సెన్సెక్స్ 796 పాయింట్లు తగ్గి 66,800.84 పాయింట్ల వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 231.90 పాయింట్లు పతనమై 19,901.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.95 లక్షల కోట్లు తగ్గి రూ.320.04 లక్షల కోట్లకు చేరింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఫలితాల కంటే ముందే యూఎస్ బాడ్లు బుధవారం దిగువ మొదలయ్యాయి. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన స్టాక్స్లో నష్టాలు 16 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు క్షీణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది.
అయితే, బుధవారం హెచ్డీఎఫ్డీ షేర్లు మూడుశాతం వరకు పతనమయ్యాయి. వాస్తవానికి హెచ్డీఎఫ్సీ విలీన ఒప్పందం తర్వాత కంపెనీ షేర్లు మూడుశాతం వరకు పెరిగాయి.ట్రేడింగ్లో దాదాపు 1,510 షేర్లు పురోగమించగా.. 2,034 షేర్లు క్షీణించాయి. 137 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా నష్టపోగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. సెక్టార్లలో, పవర్ మినహా, అన్ని ఇతర రంగాల సూచీలు బ్యాంక్, మెటల్ మరియు రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించాయి.