ముంబై, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆకర్షణీయ ప్రదర్శననే కనబర్చాయి. వరుసగా నాలుగోరోజూ వృద్ధిపథంలో నడిచాయి. ఈ క్రమంలోనే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఆల్టైమ్ హైవద్ద నిలిచింది. 134.75 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 20,267.90 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 158.4 పాయింట్లు లేదా 0.78 శాతం ఎగబాకి సరికొత్త ఇంట్రా-డే రికార్డును నెలకొల్పుతూ 20,291.55 స్థాయిని తాకింది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 11 వారాల గరిష్ఠాన్ని చూపుతూ 492.75 పాయింట్లు లేదా 0.74 శాతం పుంజుకొని 67,481.19 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే. ఇక ఇంట్రా-డేలోనైతే 575.89 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 67,564.33 స్థాయికి వెళ్లింది.
మదుపరులు ఉదయం ఆరంభం నుంచే కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో విద్యుత్తు రంగ షేర్లు అత్యధికంగా 1.57 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ (1.53 శాతం), యుటిలిటీస్ (1.46 శాతం), రియల్టీ (1.32 శాతం), మెటల్ (1.07 శాతం), కమోడిటీస్ (0.92 శాతం), ఇండస్ట్రియల్స్ (0.88) షేర్లు పెరిగాయి. ఐటీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.96 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.48 శాతం మేర వృద్ధి చెందాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో కీలకమైన చైనా సూచీ లాభాల్లో ముగిసింది. అయితే దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా దేశాల్లో మాత్రం జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లో కదలాడాయి. అమెరికా మార్కెట్లూ చాలావరకు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రూ.8,147.85 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారని శుక్రవారం ఆయా స్టాక్ ఎక్సేంజీలు తెలిపాయి. కాగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,511.15 పాయింట్లు లేదా 2.29 శాతం పెరగగా, నిఫ్టీ 473.2 పాయింట్లు లేదా 2.39 శాతం పెరిగింది.