Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ దాడికి తక్షణం ప్రతీకారం తీర్చుకోబోమని ఇరాన్ ప్రకటించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల మద్దతు, ఫైనాన్సియల్ స్టాక్స్ దన్నుతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
ఇరాన్లో మూడు పేలుళ్లు సంభవించడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం ప్రారంభంలో 672 పాయింట్లు పతనమైంది. కానీ మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి 599 పాయింట్ల లబ్ధితో 73,088 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ లో 21,778 పాయింట్ల కనిష్టానికి పడిపోయి, చివరకు151 పాయింట్లతో 22,147 పాయింట్ల లాభంతో స్థిర పడింది.
బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిం ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్ 1-3 శాతం మధ్య లాభ పడ్డాయి. హెచ్ సీఎల్ టెక్నాలజీ, నెస్లే ఇండియా, టీసీఎస్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.39 శాతం, స్మాల్ క్యాప్ 0.04 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్సులు ఒక శాతం చొప్పున లాభ పడితే, నిఫ్టీ రియాల్టీ 0.7 శాతం పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.83.46 వద్ద కొనసాగుతున్నది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 86.35 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.