ముంబై, మే 24: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్కేర్ రంగ సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం సెంటిమెంట్ను నీరుగార్చింది. చమురు ధరలు నిలకడగా ఉండటంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో భారీ నష్టాలను నియంత్రించగలిగాయి.
ఇంట్రాడేలో 200 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 7.65 పాయింట్లు కోల్పోయి 75,410.39 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ తొలిసారిగా 23 వేల పాయింట్లను అధిగమించింది. ఒక దశలో 58.75 పాయింట్లు అందుకొని 23,026.40 రికార్డు స్థాయికి చేరుకున్న సూచీ చివరకు స్వల్పంగా 10.55 పాయింట్లు నష్టపోయి 22,957.10 వద్ద ముగిసింది.
గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్(ఏపీసెజ్)..బీఎస్ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్లోకి అడుగుపెట్టబోతున్నది. వచ్చే నెల 24 నుంచి దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో స్థానాన్ని ఏపీసెజ్ భర్తిచేయనున్నది. అలాగే టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ లిమిటెడ్ సెన్సెక్స్ 50లోకి ప్రవేశించింది. ఈ ఇండెక్స్ నుంచి దివీస్ ల్యాబ్ వైదొలిగింది.