సెన్సెక్స్ 100, నిఫ్టీ 25 పాయింట్లు క్షీణత
ముంబై, జూలై 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ పరుగులు పెడుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్, మెటల్స్, ఎనర్జీ, ఫార్మా షేర్లు మదుపరులను విపరీతంగా ఆకర్షించాయి. అయితే ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో చివర్లో బ్యాంకింగ్తోపాటు ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 100.42 పాయింట్లు లేదా 0.19 శాతం దిగజారి 53,134.35 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 24.5 పాయింట్లు లేదా 0.15 శాతం పడిపోయి 15,810.85 వద్ద నిలిచింది.
ఐటీసీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 1.73 శాతం నుంచి 0.57 శాతం వరకు క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్ వంటి పలు భారీ షేర్లు లాభాల్లో ముగిసినా సూచీలను నష్టాల్లో నుంచి గట్టెక్కించలేకపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.35 శాతం పడిపోగా, స్మాల్క్యాప్ సూచీ 0.2 శాతం పెరిగింది. మొత్తంగా ఐటీ షేర్లు 0.59 శాతం, టెక్నాలజీ 0.57 శాతం, బ్యాంకింగ్ 0.37 శాతం, ఆటో 0.32 శాతం, రియల్టీ 0.29 శాతం, టెలికం షేర్లు 0.28 శాతం చొప్పున నష్టపోయాయి.
అంతర్జాతీయంగా..
ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ప్రధానమైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ‘గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుత పరిస్థితులు.. అనిశ్చితి, మాంద్యం, కఠిన ద్రవ్యవిధానాలకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ మదుపరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్నో వర్ధమాన దేశాల కరెన్సీలను డాలర్ సూచీ ప్రభావితం చేస్తున్నది. రూపాయినీ పడేస్తున్నది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.