Stock Market Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా దూసుకెళ్తున్నాయి. వారంలో తొలిరోజైన సోమవారం భారీ లాభాలను నమోదు చేస్తూ.. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 1,383.93 పాయింట్ల లాభంతో 68,865.12 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 418.90 పాయింట్లు లాభపడి 20,686.60 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.83 లక్షల కోట్లు పెరిగి రూ.343.51 లక్షల కోట్లకు చేరుకుంది.
గత ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.337.67 లక్షల కోట్లుగా ఉంది. నిఫ్టీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడింది. నష్టపోయిన వాటిలో హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో, సన్ఫార్మా, టైటాన్ కంపెనీ ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. విస్తృత సూచీల్లో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఒకశాతం చొప్పున పెరిగాయి.