Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ 2,200 పాయింట్లు, నిఫ్టీ 660 పాయింట్లకుపైగా పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో భారత్తో పాటు ప్రపంచ దేశాల్లోని మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మార్కెట్ల పతనంతో ఒకే రోజు దాదాపు 17లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. కిత్రం సెన్సెక్స్ 80,981.95 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం సెన్సెక్స్ 78,588.19 పాయింట్ల భారీ నష్టంతో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 79,780.61 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 78,295.86 పాయింట్ల కనిష్ఠానికి చేరుకున్నది. చివరకు 2,222.55 పాయింట్ల నష్టంతో 78,759.40 వద్ద ముగిసింది.
ఇటీవల 82వేల పాయింట్ల మార్క్ను దాటిన సెన్సెక్స్ మళ్లీ చాలా రోజుల తర్వాత 78వేల పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ సైతం 662.10 పాయింట్లు పతనమై.. 24,055.60 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 471 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 3,082 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, టాటా స్టీల్ ఉన్నాయి. ఇక హెచ్యూఎల్, నెస్లే, టాటా కన్స్యూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి. ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, మీడియా, రియల్టీ 4శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 3.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.2 శాతం పతనమయ్యాయి.