Stock Marekt Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 845 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సైతం మార్కెట్ల స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్ల పతనంతో రూ.7.5లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.
కిత్రం సెషన్లో 74,244.90 సెన్సెక్స్ పాయింట్ల వద్ద ముగియగా.. సోమవారం 73,315.16 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఏకంగా 900 పాయింట్లకుపైగా కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ సెన్సెక్స్ కోలుకోలేదు. పొద్దంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో 73,905.80 పాయింట్ల గరిష్ఠానికి పెరిగిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 73,315.16 పాయింట్లకు చేరింది. చివరకు 845.12 పాయింట్ల నష్టంతో 73,399.78 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం భారీగానే నష్టపోయింది.
246.90 పాయింట్లు పతనమై 22,272.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 761 షేర్లు పురోగమించగా, 2636 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, లార్సెన్ అత్యధికంగా నష్టపోయాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, మారుతి సుజూకీ, నెస్లే, బ్రిటాయా లాభాల్లో ముగిశాయి. సెక్టార్లలో చమురు, గ్యాస్, మెటల్ మినహా. మిగతా రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున క్షీణించాయి.