Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 22వేల పాయింట్లకు దిగువన ముగిసింది. దేశంలో రాజకీయ పరిస్థితులు, కూడ్రాయిల్ ధరలు తదితర కారణాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు కుదేలయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సూచీలు పతనమయ్యాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. గురువారం ఉదయం సెన్సెక్స్ 73,499.49 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 73,499.49 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 72,334.18 పాయింట్లకు పడిపోయింది. చివరకు 1,062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది.
నిఫ్టీ 345 పాయింట్లు పతనమై 21,957.50 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు, బలహీన కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరల పెరుగదల కారణాలతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నిఫ్టీలో హీరోమోటాకార్ప్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ లాభాల్లో ముగిశాయి. లార్సెన్, ఏషియన్ పేయింట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్, అదానీ ఎంటర్ప్రైజెస్ తదితర షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీలో ఆటో మినహా అన్ని రంగాలు క్షీణించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు 3.2 శాతం పతనమయ్యాయి. మెటల్ 2.9 శాతం, ఎఫ్ఎంసీజీ 2.5 శాతం దిగజారాయి. ఫార్మా, రియాల్టీ సూచీలు 2శాతం తగ్గాయి. నిఫ్టీ ఆటో 0.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గురువారం ట్రేడింగ్ సెషన్లో దలాల్ స్ట్రీట్లో దాదాపు రూ.7.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.400 లక్షల కోట్ల నుంచి రూ.393.73 లక్షల కోట్లకు తగ్గింది.