న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం నిస్తేజంగా లిస్టయ్యాయి. ప్రభుత్వ ఖజానాకు రూ. 20,557 కోట్లు సమకూర్చిపెట్టి, ఇష్యూ పరిమాణానికి 3 రెట్లు అధికంగా స్పందన తెచ్చుకున్న ఎల్ఐసీ షేర్లు తొలిరోజున ఇన్వెస్టర్లకు లాభాలను ఇవ్వకపోగా, నష్టాలను మిగిల్చాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే బీఎస్ఈలో ఈ షేరు 8 శాతం తక్కువగా 872 వద్ద లిస్ట్కాగా, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద తొలి ట్రేడ్ జరిగింది. ఎల్ఐసీ పాలసీదారులకు, ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్లో కేటాయించిన ధరకంటే తక్కువకు లిస్ట్కావడం గమనార్హం. వివరాలు..
లిస్టయిన తర్వాత రూ.918 గరిష్ఠస్థాయి-రూ.860 కనిష్ఠస్థాయిల మధ్య ఊగిసలాడి, రోజంతా ఇష్యూ ధర దిగువనే ఈ షేరు ట్రేడయ్యింది.
చివరకు ఎన్ఎస్ఈలో రూ. 873 వద్ద, బీఎస్ఈలో రూ. 875.45 వద్ద ఎల్ఐసీ షేరు ముగిసింది.
ఎన్ఎస్ఈలో 4.87 కోట్ల షేర్లు ట్రేడ్కాగా, బీఎస్ఈలో 27.52 లక్షల షేర్లు చేతులు మారాయి.
గత మూడు నెలల్లో ఎన్నడూ లేనంతగా 2 శాతంపైగా స్టాక్ సూచీలు పెరిగిన రోజే ఎల్ఐసీ నష్టాలతో ముగిసింది.
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 22.13 కోట్ల షేర్లను (3.5 శాతం) ఐపీవోలో విక్రయించి రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్లకు ఒక్కోదానికి రూ.949 ధరతో షేర్లను కేటాయించారు. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్తో రూ. 889 ధరపై షేర్లను కేటాయించగా, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 డిస్కౌంట్తో రూ. 904 ధరతో షేర్లను అలాట్ చేశారు. 3 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబ్ అయిన ఈ ఇష్యూ మే 9న ముగిసింది.
అనిశ్చిత పరిస్థితులే కారణం: దీపం కార్యదర్శి
స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ షేర్లు బలహీనంగా లిస్ట్కావడానికి అనిశ్చిత మార్కెట్ పరిస్థితులే కారణమని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్కాంత్ పాండే చెప్పారు. లిస్టింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలిక విలువ కోసం ఈ షేరును అట్టిపెట్టుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు. ఎల్ఐసీ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుంచి 73 లక్షల దరఖాస్తులు వచ్చాయని, మార్కెట్లో తొలిసారి ఇన్వెస్ట్చేసిన వారి నుంచే 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వారిలో 7 లక్షల మందికి ఎల్ఐసీ షేర్ల కేటాయింపు జరిగిందని వివరించారు. భారత్ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇది ఒక రికార్డన్నారు. రోజులు గడిచేకొద్దీ ఈ షేరు పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వ్యక్తం చేశారు. పబ్లిక్ ఆఫర్లో తగినన్ని షేర్ల కేటాయింపు జరగని పాలసీదారులు స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తారని, ఎక్కువకాలం ఈ షేరు క్షీణదశలో ఉండేందుకు కారణాలేవీ కన్పించడం లేదన్నారు. గత త్రైమాసికంలో కార్పొరేషన్ నాన్-పార్టిసిపేటరీ, గ్యారంటీ బీమా పత్రాలు రెండింటిని విడుదల చేసిందని, వాటిని విరివిగా విక్రయించాలని భావిస్తున్నట్టు కుమార్ తెలిపారు.
సగం విలువ కూడా చేయదు మాజీ ఆర్థిక కార్యదర్శి గార్గ్
ఎల్ఐసీ షేరు..ఇష్యూ ధరలో సగం విలువ కూడా చేయదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. ఈ షేరు 8 శాతం తక్కువగా లిస్టయిన అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఎల్ఐసీ తన సరైన విలువ దిశగా ప్రయాణిస్తున్నట్టు కన్పిస్తున్నదన్నారు. ఇదే అభిప్రాయాన్ని డైమన్షన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ సర్వీసెస్ సీఈవో అజయ్ శ్రీవాస్తవ వ్యక్తం చేశారు. ఇటువంటి మార్కెట్లో షేర్హోల్డర్లకు ఎల్ఐసీ లాభాల్ని ఇస్తుందంటే నమ్మడం కష్టమని, మరో ఏడాది తర్వాత ఇంకో విడత షేర్లను ప్రభుత్వం విక్రయిస్తుందని, దాంతో ఎల్ఐసీ షేర్ల సరఫరా మార్కెట్లో పెరిగిపోతుందన్నారు. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వయిరీ ఈ షేరుకు ‘న్యూట్రల్’ రేటింగ్ ఇచ్చింది. ఏడాదికాలంలో ఇష్యూ ధర నుంచి 5.4 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ షేరులో నష్టాల్ని స్వీకరించాల్సిన అవసరం లేదని, ఈ స్టాక్లో మంచి విలువ ఉందని, దీనిని అట్టిపెట్టుకోమని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నవీన్ కులకర్ణి సూచించారు.