Adani Group | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీసెజ్)కు చెందిన ఆంధ్రప్రదేశ్ తీరంలోని గంగవరం పోర్టు వద్ద ఐఓసీతో కుదిరిన ‘టేక్ ఆర్ పే’ ఒప్పందం మేరకు ఎల్పీజీ హ్యాండ్లింగ్ టర్మినల్ నిర్మిస్తున్నట్టు అదానీ ప్రకటించిన వారం రోజుల్లోనే అటువంటి ఒప్పందం లేదంటూ ఐఓసీ తిరస్కరించింది.
ప్రభుత్వ రంగానికి చెందిన వైజాగ్ పోర్ట్ నుంచి ఐఓసీ దిగుమతుల వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థ అదానీ పోర్ట్కు మళ్లిస్తున్నారని, ఇది ‘ఘరానా దొంగతనం’గా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా అభివర్ణిస్తూ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్కు కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ పురి, సీవీసీలను ట్యాగ్ చేశారు. ఇందుకు స్పందనగా ఐఓసీ పలు ట్వీట్స్ చేస్తూ సమీప ఓడరేవులతో ప్రస్తుతం ఉన్న ఒప్పందాలకు అదనంగా అదానీ గ్రూప్కు చెందిన గంగవరం పోర్ట్తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నట్టు తెలిపింది. అయితే ఈ ఎంఓయూలో ‘టేక్ ఆర్ పే’ ఒప్పందం ఏదీ లేదంటూ ప్రకటించింది.
‘గంగవరం పోర్టు వద్ద ఎల్పీజీ హ్యాండ్లింగ్ టర్మినల్ను నిర్మించేందుకు ఒక ‘టేక్ ఆర్ పే’ కాంట్రాక్టు కోసం ఐఓసీతో ఒక ఎంఓయూపై సంతకాలు చేశాం’ అంటూ గతవారంలో అదానీ పోర్ట్స్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. వార్షికంగా 5 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతికి ఈ టర్మినల్ను ఉద్దేశించారు. ‘టేక్ ఆర్ పే’ ఒప్పందం ప్రకారం ఐఓసీ 5 లక్షల టన్నులకంటే తక్కువ ఎల్పీజీని దిగుమతి చేసుకున్నా, అంతే పరిమాణానికి సరిపడా అదానీ పోర్ట్స్కు చెల్లించాలి. టర్మినల్ను వాడకపోయినా చెల్లించాల్సిందే. ‘టెండరు లేదు..సీవీసీ నిబంధనలు లేవు… వ్యాపారాన్ని వైజాగ్ పోర్ట్ నుంచి గంగవరానికి మళ్ళించారు. బోగ్గు నుంచి పిండుకున్నారు, గ్యాస్ నుంచి పిండుకున్నారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఉండే ‘పొయ్యి’పై పడ్డారు. సిగ్గుసిగ్గు’ అంటూ మోయిత్రా విరుచుకుపడ్డారు. ఈ విమర్శలపై ఐఓసీ స్పందిస్తూ ఏపీసెజ్తో ప్రస్తుతానికి ఒక నాన్-బైండింగ్ ఎంఓయూపై ఐఓసీ సంతకాలు చేసిందని, అందులో ఎటువంటి బైండింగ్ ఒప్పందం లేదని, ‘టేక్ ఆర్ పే’ క్లాజ్ కూడా లేదని వివరించింది.