న్యూఢిల్లీ, మే 21: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.489.62 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.02 కోట్లతో పోలిస్తే 25 శాతం తగ్గింది.
నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. నిర్వహణ ఖర్చులు రూ.7,411.64 కోట్ల నుంచి రూ.7,794.11 కోట్లకు పెరిగాయని తెలిపింది. కంపెనీ ఆదాయం రూ.8,416.84 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 25 పైసల డివిడెండ్ను ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.24,439.05 కోట్ల ఆదాయంపై రూ.282.22 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.