ఉదయ్పూర్, మే 14: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళకరంగా ఉన్నదని, అంతర్జాతీయ, దేశీ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక విధానాల్లో మార్పు తేవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి గత ఎనిమిదేండ్లుగా మందగమన ఆర్థిక వ్యవస్థ అనేది ‘హాల్మార్క్’ స్థిరపడిపోయిందని విమర్శించారు. కరోనా వేవ్స్ తర్వాత రికవరీ తగినంతగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని పెంచుతున్నదని, ధరల అదుపునకు, ఉపాధి కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని చిదంబరం డిమాండ్ చేశారు. విదేశీ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని, వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కన్పిస్తున్నదన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నదన్న కేంద్రం వాదనను చిదంబరం కొట్టివేశారు. అధిక టోకు, రిటైల్ ద్రవ్యోల్బణానికి పెరిగిన చమురు ధరలే కారణం కాదని, యుద్ధానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల్ని గణనీయంగా ఎందుకు తగ్గించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జీఎస్టీని నాసిరకంగా రూపొందించడం, అన్యాయంగా అమలు చేయడంతో సంభవించిన పరిణామాలను ప్రతీ ఒక్కరూ చూస్తున్నారని చిదంబరం అన్నారు. కేంద్రం-రాష్ర్టాల మధ్య విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నదని, రెండింటి మధ్య ద్రవ్య సంబంధాల్ని సమగ్రంగా సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జీఎస్టీ నష్ట పరిహారాన్ని మరో మూడేండ్లు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నాయని చిదంబరం చెప్పారు.