హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు రూ.52,153 కోట్లు వృద్ధి చెందితే, రుణాలు రూ.99,283 కోట్లు పెరిగాయి. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ఈ జూలై-సెప్టెంబర్కుగాను 39వ త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ ఏప్రిల్-సెప్టెంబర్లో బ్యాంకుల పనితీరును వివరించారు.
సీడీ రేషియో 124.22 శాతంగా ఉందని, స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు 79.48 శాతం ఎగిసి రూ.35,023 కోట్లకు చేరాయన్నారు. వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయంగా రూ.26,730 కోట్ల రుణాలు ఇచ్చామని, విద్యా రుణాలు రూ.396 కోట్లు, గృహ రుణాలు రూ.1,832 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రూ.67,723 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఇక ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద రూ.4,485 కోట్ల రుణాలు బ్యాంకులిచ్చాయని తెలిపారు.
కాగా, రాష్ట్రంలోని బ్యాంకుల్లో 113.72 లక్షల పీఎంజేడీవై ఖాతాలున్నాయని, ఈ ఖాతాదారులకు 84.75 లక్షల రూపే కార్డులను జారీ చేశామన్నారు. ఇక 17.57 లక్షల కస్టమర్లు అటల్ పెన్షన్ యోజన స్కీమును తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి టీకే శ్రీదేవి, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కే నిఖిల, నాబార్డు సీజీఎం సీహెచ్ సుశీల, ఎస్ఎల్బీసీ తెలంగాణ కన్వీనర్, ఎస్బీఐ జీఎం దేబాశిష్ మిత్రా తదితరులు పాల్గొన్నారు.