హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఏఐ మిషన్ ‘రెవ్ అప్’ 4వ విడత కార్యక్రమానికి 62 స్టార్టప్లను ఎంపిక చేశామని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణం నుంచి స్టార్టప్ల నిర్వాహకులు ప్రయోజనం పొందేందుకు, వారిని అన్నివిధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మరో రాష్ట్రంలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించే ఆలోచన కూడా ఉందన్నారు. తద్వారా అక్కడ కూడా ప్రభుత్వ ఆలోచనల్ని విస్తరించే వీలుంటుందని, స్థానిక స్టార్టప్లకు చేయూతనీయవచ్చని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఎంపికైన 62 స్టార్టప్లలో సాస్, స్మార్ట్ సిటీస్, అగ్రికల్చర్, హెల్త్కేర్ తదితర 15 రంగాలకు చెందిన 13 రాష్ర్టాల స్టార్టప్లున్నాయి.
ఇక ఎంపిక చేసిన స్టార్టప్లను ఏడాదిపాటు వివిధ అంశాల్లో ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వారికి మద్దతుగా ఉంటామని, భవిష్యత్తులో దేశ, విదేశాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఏఐ స్టార్టప్లకు ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. కాగా, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఒకటైన కృతిమ మేథస్సు (ఏఐ)పై స్టార్టప్లను నిర్వహిస్తున్నవారి కోసం రెవ్ అప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఆయా శాఖల్లో ఏఐ వినియోగంపైనా దృష్టి సారించింది. కాగా, ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, పారిశ్రామికవేత్తలతో మమేకం కావడానికి, విదేశీ మార్కెట్లను అన్వేషించడానికి ఏఐ స్టార్టప్లకు మెరుగైన అవకాశాలుంటున్నాయి.