హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఉన్నతంగా ఆలోచించాలని సూచించారు. జపాన్ వంటి దేశాలతో మనం స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఎంతో ముఖ్యమైనవని, సహజంగా ఒక ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను తదుపరి వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తాయన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా గతంలో చంద్రబాబు నాయుడు వాణిజ్యం, ఐటీ రంగాలకు ప్రాధాన్యతనిస్తే, తదుపరి వచ్చిన వైఎస్ఆర్ వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కాగా, సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్డీపీ కేవలం 5లక్షల 5వేల కోట్లే ఉండగా, నేడు 13.27లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అలాగే తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి 3.70 లక్షలకు పెరిగిందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకన్నా ఇది అత్యంత ఎక్కువని చెప్పారు. అలాగే ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు తెలంగాణలో తయారవుతున్నాయన్నారు. వచ్చే ఏడాదికి ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మన రాష్ట్రంలోనే తయారవుతాయని ధీమా వ్యక్తం చేశారు. యుఎస్ఎఫ్డీఏ అనుమతించిన ఔషధాల్లో తెలంగాణ కంపెనీలే అత్యధికంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు చెందిన 214 ఔషధాలకు ఆమోదం తెలపగా, 189 ఔషధాలతో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉందన్నారు.
వైద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ను సుల్తాన్పూర్లో ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఇందులో 60 కంపెనీలు కొలువుదీరినట్టు, అందులో ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కంపెనీ ఉందన్నారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ను ముచ్చెర్లలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తయారీ రంగంలో అమెరికా, చైనా వంటి దేశాలుసహా ప్రపంచంతో పోటీపడాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్షని వివరించారు. రెండేండ్ల క్రితం బయో ఏషియా సదస్సు సందర్భంగా అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్తో పారిశ్రామికవేత్తలు సమావేశమైన సందర్భంగా ఓ పారిశ్రామికవేత్త మాట్లాడుతూ.. మన దేశంలో తయారు చేయడంకన్నా గ్లౌజ్లు, మాస్క్లు వంటివి చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఎంతో చౌకగా ఉంటుందని చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారితో ఎలా పోటీపడగలమన్నారు. ఇదొక్కటే కాదని, దేశంలో 78శాతం మెడికల్ డివైజెస్లు, 80శాతం వంట నూనెలుసహా అనేకం దిగుమతి అవుతున్నాయన్నారు.
ఔషధ రంగంలో సైతం ఏపీఐల దిగుమతికి చైనాపైనే ఆధారపడాల్సి వస్తున్నదని కేటీఆర్ అన్నారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో హాజరయ్యేందుకు 2015లో సీఎం కేసీఆర్ చైనా వెళ్లారని, అక్కడి షీచో అనే ప్రాంతంలో 70,000 ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ను గమనించిన తరువాత చైనా తరహాలోనే భారీస్థాయిలో పారిశ్రామికీకరణ చేయాలని నిర్ణయించారన్నారు. ఇతర రాష్ర్టాలకన్నా మనం మెరుగ్గా ఉన్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ భారీస్థాయిలో దిగుమతులు చూసినప్పుడు ఒక భారతీయుడిగా ఆవేదన కలుగుతుందన్నారు. తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ర్టాలకు మాత్రమే ఆదర్శంగా ఉంటే సరిపోదని, ప్రపంచస్థాయిలో పోటీపడేలా ఉండాలన్నారు. ఎఫ్టీసీసీఐ ఈ దిశగా పెద్దగా ఆలోచించాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటైన మొదట్లో అధికారులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఎందుకు పొందాలని ప్రశ్నించారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అనుమతుల కోసం ఎందుకు ఇంత సమయం పడుతుందని ఆయన ప్రశ్నించారని చెప్పారు. జవాబుదారీతనం కోసం అనుమతి పొందాల్సి ఉంటుందని అధికారులు తెలపగా, రైట్ టూ ఎడ్యుకేషన్ మాదిరిగా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టాలని కేసీఆర్ సూచించారన్నారు. అప్పట్నుంచి టీఎస్ ఐ-పాస్ విధానం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. దేశంలో ఇటువంటి విధానం ఎక్కడా లేదన్నారు.
ఎఫ్టీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో వరుసగా మూడుసార్లు పాల్గొని హ్యాట్రిక్ సాధించినట్టు, త్వరలో తెలంగాణ రాష్ర్టానికి మూడవ దఫా ఎన్నికలు జరుగుతున్నందున మీరు కూడా మా ప్రభుత్వానికి హ్యాట్రిక్ సాధించి పెట్టి నన్ను మరోసారి ఇక్కడికి వచ్చేలా చూడాలని కేటీఆర్ కోరారు. కార్యక్రమం అనంతరం ఎంపికచేసిన 22 కంపెనీలకు ఎక్స్లెన్స్ అవార్డులను మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, గ్రీన్కో గ్రూపు ఎండీ అనిల్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
మనం వాడుతున్న ఫోన్లు, గడియారాలు, కార్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఇంట్లో వాడే వస్తువులన్నీ ఇతర దేశాలకు చెందిన కంపెనీలవేనని, 70-80 శాతం వస్తువులు దిగుమతి అయినవేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. థాయ్లాండ్, వియాత్నాంలో విదేశీ వస్తువుల వినియోగం చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన జపాన్ జనాభా కేవలం 12 కోట్లేనని, 90శాతం భూభాగం నివాసయోగ్యంగా లేకున్నప్పటికీ అసాధారణ ప్రగతి సాధించిందని, నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగివున్నదన్నారు. ప్రకృతి వనరులు లేకున్నప్పటికీ కేవలం తమ జ్ఞానం ద్వారా వారు 40 ఏండ్లలో ఇంతటి ప్రగతి సాధించారన్నారు. ఇతర రాష్ర్టాలతో పోటీకాకుండా పెద్దగా ఆలోచించాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఎఫ్టీసీసీఐ యువ బృందాన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు పంపి అధ్యయనం చేయాలని, ఐడియా ఉంటే పెట్టుబడి దానంతట అదే వస్తుందని వివరించారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని, 2009-10లో లండన్లో ఏర్పాటైన గ్రీన్గో కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నదని ఉదహరించారు. 30 ఏండ్ల క్రితం లైసెన్స్రాజ్లో పరిశ్రమలు పెట్టేందుకు అనుమతుల కోసం ఎన్నో పైరవీలు చేయాల్సివచ్చేదని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు అందుబాటులో ఉంటున్నారన్నారు.
జాతీయ పంచాయితీ అవార్డుల్లో తెలంగాణ 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నదని, దేశ జనాభాలో రెండున్నర శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో ఐదు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నదన్నారు. ఐటీ ఎగుమతులు 2014లో రూ.56వేల కోట్లు కాగా, నేడు 2.41 లక్షల కోట్లకు పెరిగాయని, 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, నేడు మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నానమన్నారు. పారిశ్రామిక రంగం కూడా ఎంతో ప్రగతి సాధించిందని, 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించినట్టు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం తదితర అన్ని రంగాలూ సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ తెలంగాణ రాష్ట్రమని వివరించారు.