పారిశ్రామిక ప్రగతి ద్వారా తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్నది.
గడిచిన ఎనిమిదేండ్లలో 56 పారిశ్రామిక వాడలను తీసుకురాగా.. భవిష్యత్తులో మరో 70 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేశారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ 40 ఏండ్లలో తెలంగాణలో 109 పారిశ్రామిక వాడలనే తెచ్చింది. కానీ కేవలం ఎనిమిదేండ్లలోనే ఇందులో సగానికిపైగా టీఎస్ఐఐసీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇది పారిశ్రామికీకరణపట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తున్నది.
ఇప్పటికే ఐటీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పలు పెద్ద రాష్ర్టాలను సైతం వెనక్కునెట్టి శరవేగంగా దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఎగుమతుల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారు. ఆహారోత్పత్తులు, ముడిసరుకు ఆధారంగా అక్కడక్కడ చిన్న, మధ్యతరహా యూనిట్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతోపాటు దేశ, విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. అయితే నీటి పారుదల రంగం అభివృద్ధితో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం.. ఆహార శుద్ధి పరిశ్రమలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంపొందిస్తే.. జిల్లాల నుంచి హైదరాబాద్కు వలసలను కూడా అరికట్టవచ్చని ప్రభుత్వం యోచిస్తున్నది.
తెలంగాణకు దేశంలోని మరే ఇతర రాష్ర్టానికి లేని అనుకూలతలున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రం ప్రవేశద్వారంగా ఉన్నది. పైగా ఇక్కడి నుంచి సులభంగా రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా దేశవ్యాప్తంగా సరుకు రవాణా చేసే వీలున్నది. ముఖ్యంగా హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని ఏ మూలకైనా 4-5 గంటల్లోనే చేర్చవచ్చు. ఇతర దేశాలకూ ఎగుమతి చేసే ఆస్కారమున్నది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఓడరేవులు ఉండటంతో సముద్ర మార్గం కూడా కలిసొస్తుంది. ఇక సమశీతోష్ణస్థితి, అన్ని రకాల పంటలకు పనికొచ్చే చక్కని వాతావరణం-భూములతోపాటు, నైపుణ్యం, ప్రతిభగల మానవ వనరులు తెలంగాణ సొంతం.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు పారిశ్రామికీకరణ ద్వారా అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. ఇక ఆధునిక ప్రపంచంలో చైనా, తైవాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు అంతర్జాతీయ ఉత్పాదక కేంద్రాలుగా అవతరించాయి. ఈ దేశాల ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలదే కీలకపాత్ర. భారత్లో సైతం ఇటువంటి అద్భుతాలు ఎందుకు జరగకూడదనే తలంపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను పారిశ్రామిక రంగంలో అగ్రభాగాన నిలబెట్టాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా త్వరితగతిన అనుమతులు జారీచేసే విధానం పరిచయమైంది.