భోపాల్, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. ఏదైనా అనధికార లావాదేవీని గుర్తించినట్టయితే కస్టమర్లు వెంటనే బ్యాంక్ సిబ్బందికి తెలియజేయాలని, దీనివల్ల మరింత నష్టం జరగకుండా అడ్డుకోవచ్చని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా సూచించారు.
బాధితులు 18001-2-3-4 టోల్-ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సదరు అనధికార లావాదేవీ గురించి చెప్పవచ్చని శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఖారా స్పష్టం చేశారు. కాగా, యోనో యాప్, ఇతర డిజిటల్ మాధ్యమాలతో ఖాతాదారులకు ఏవిధంగా మెరుగైన, ఉన్నతస్థాయి సేవలను అందిస్తున్నామో కూడా ఈ సందర్భంగా ఖారా వివరించారు. యోనో యాప్ను ఖాతాదారులు బాగా వినియోగించుకుంటున్నారనీ కొనియాడారు. ఇదిలావుంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా వివిధ కార్యక్రమాల నిమిత్తం ఖారా భోపాల్కు వచ్చారు.