న్యూఢిల్లీ, మార్చి 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ భారీగా నియామకాలు చేపట్టింది.
ఈ తాజా నియామకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్టు అయిందని బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఆరేండ్లలో మొత్తం వ్యాపారం రూ.200 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంక్..ఇక నుంచి ప్రతియేటా 16 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బ్యాంక్లో 2.48 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.