న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారితో అన్ని రంగాల పరిశ్రమలు కుదేలయ్యాయి. సేల్స్ పడిపోయి ఆటోమొబైల్ అల్లాడిపోతున్నది. అయితే, విశ్వమారి ప్రభావంతో పర్సనల్ మొబిలిటీకి డిమాండ్ పెరిగింది. వాహనాలను ఎంపిక చేసుకోవడంలో ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది.
గ్రేట్ లుక్తో కూడిన మల్టీ పర్పస్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి స్పోర్టీ లుక్ ఉన్న కార్ల వైపు మొగ్గుతున్నారు. దేశంలోని ప్రతి మూడు కార్ల కొనుగోళ్లలో ఒకటి ఎస్యూవీ అంటే అతిశయోక్తి కాదు.
ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దాదాపు ఐదు లక్షల ఎస్యూవీ కార్లు అమ్ముడయ్యాయి. కోవిడ్ ప్రభావం ఉన్నా 2020లో మొత్తం 7.07 లక్షల ఎస్యూవీ కార్ల కొనుగోళ్లు జరిగాయి.
గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్యూవీల వాటా 29 శాతమే. ఈ ఏడాది అది 35 శాతానికి పెరిగింది. గత నెలలో జరిగిన మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్యూవీల వాటా 48.5 శాతంగా ఉండటం ఆసక్తికర పరిణామం.
మొత్తం ఎస్యూవీ కార్ల విక్రయాల్లో హ్యుండాయ్ వాటా 45 శాతంగా రికార్డైంది. 2015లో దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో 9 శాతంగా ఉన్న ఎస్యూవీ సేల్స్.. గత నెలలో 23 శాతానికి పెరిగాయి. కోవిడ్-19 తలెత్తిన ఇబ్బందులు పరిష్కారమైన తర్వాత ఎస్యూవీ కార్ల విక్రయాల్లో హ్యుండాయ్ వాటా పెరుగుతుందని అంచనా.
స్పోర్టీ లుక్ కార్ల పట్ల ప్రజలు మొగ్గు చూపుతుండటంతో కార్ల తయారీ సంస్థలన్నీ ఎస్యూవీ కార్ల తయారీపైనే ఫోకస్ చేస్తున్నాయి. శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించిన అల్కాజర్ మోడల్ ఎస్యూవీ కార్ల కోసం ఇప్పటికే 4,000 బుకింగ్స్ నమోదయ్యాయి.
ఈ ఏడాది 10కి పైగా నూతన మోడల్ కార్లు విపణిలో ప్రవేశించనున్నాయి. ఇక ఇప్పటికే మార్కెట్లో ప్రవేశించిన ఎస్యూవీ మోడల్ కార్లలో హ్యుండాయ్ అల్కాజార్ కారు నాల్గవది. మెరుగైన ఇంధన సామర్థ్యం గల వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది.
ఇక గత రెండు నెలల్లో మారుతి ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కారు విటారా బ్రెజా సేల్స్ 2.9 పాయింట్లు పెరిగాయి. ఎస్యూవీ విభాగంలో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నదని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.