న్యూఢిల్లీ, మార్చి 27: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ యథాతథంగానే ఉంచింది. వృద్ధిరేటు 6 శాతంగానే ఉండొచ్చని సోమవారం తెలిపింది. అయితే ఆపై ఆర్థిక సంవత్సరం (2024-25) 6.9 శాతంగా నమోదు కావచ్చన్నది.
ఆసియా-పసిఫిక్ రీజియన్ కోసం తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఆర్థిక అప్డేట్స్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం రేటు 5 శాతానికి తగ్గవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాత్రం 6.8 శాతంగా ఉంటుందని చెప్పింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీ 7 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. ఈ క్రమంలోనే 2024-26 మధ్య వృద్ధిరేటు సగటు 7 శాతంగా నమోదు కావచ్చని అభిప్రాయపడింది. 2025-26లో 6.9 శాతంగా, 2026-27లో 7.1 శాతంగా భారత జీడీపీ ఉండొచ్చని అంచనా వేసింది.