Smartphones : దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వరుసగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్ని కలవరపెడుతోంది. చిప్స్ సహా ఫోన్ కంపోనెంట్స్ ధరలు పెరగడం, కంపెనీలకు లాభాల మార్జిన్లు తగ్గడం, అంతర్జాతీయ పరిణామాల వల్ల పలు ఉత్పత్తుల రవాణా నిలిచిపోవడం వంటివి ఫోన్ల ధరలు పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయి.
ఒక కేటగిరి నుంచి ఇంకో కేటగిరిలోకి ధరలు చేరిపోయాయి. గతంలో చాలా కాలం క్రితం విడుదలైన మోడల్స్, ఇంతకుముందు తక్కువ ధరకు లభించిన ఫోన్లు కూడా ఇప్పుడు అధిక ధరలకు దొరుకుతున్నాయి. గత మార్చి నుంచి స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. అన్ని రకాల ఫోన్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో 200 రకాల స్మార్ట్ఫోన్లు ఉండగా, వాటిలో 80 మోడళ్ల ధరలు ఇప్పటికే పెరిగాయి. సగటున 15 శాతం ధరలు పెరిగాయి. త్వరలో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎక్కువ ధరల ప్రభావానికి గురవుతున్నవి మాత్రం మీడియం, ఎంట్రీ లెవల్ ఫోన్లే. రూ.15,000లోపు ధర కలిగిన ఫోన్లు ఎక్కువగా రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 33 శాతం పడిపోయాయి. ఈ తరహా ఫోన్లలో చాలా తక్కువ మార్జిన్లు వస్తుంటాయి.
తయారీ, ఇతర ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. రూ.15 వేల నుంచి రూ.30 వేల ధరలోపు ఫోన్లు మాత్రం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మార్కెట్లో వీటి వాటా 35 నుంచి 45 శాతం పెరిగాయి. అయితే, ఇందులో చాలా ఫోన్లు గతంలో బడ్జెట్ రేంజ్లోనే ఉండేవి. ఇప్పుడు మీడియం రేంజ్లో లభిస్తున్నాయి. దీంతో బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు సరైన ఫోన్లు లభించడం లేదు. ఇప్పటికే ఫోన్ల ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బంది పడుతుంటే, రాబోయే రోజుల్లో మరో 15 శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. కొత్తగా రాబోతున్న ఫోన్లు కూడా వాటి ఫీచర్లతో పోలిస్తే కనీసం 30 నుంచి 40 శాతం ధరలు పెంచి విక్రయించే ఛాన్స్ ఉంది.