Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,414 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) భారీగా నష్టపోయాయి. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,414.03 కోట్లు కోల్పోయాయి. మరోవైపు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కలిసి రూ.62,038.86 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.
గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 831.15 పాయింట్లు (1.16శాతం) నష్టపోయింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,217.12 కోట్లు పతనంతో రూ.6,57,420.26 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.18,762.61 కోట్లు నష్టపోయి రూ.14,93,980.70 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,539.84 కోట్ల పతనంతో రూ.5,05,092.18 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.11,548.24 కోట్లు కోల్పోయి 5,58,039.67 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.703.60 కోట్ల నష్టంతో రూ.6,30,340.9 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కరూ.642.62 కోట్ల పతనంతో రూ.19,76,493.92 కోట్ల వద్ద స్థిర పడింది.
బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. బుధవారం ట్రేడింగ్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రూ.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ దాటిన తొలి సంస్థగా నిలిచింది. అదే రోజు రిలయన్స్ షేర్ తాజా 52 వారాల గరిష్టం రూ.2,968.40 కి చేరుకున్నది. అంతకుముందు మంగళవారం కూడా రూ.20లక్షల కోట్ల ఎం-క్యాప్ మార్కును దాటినా.. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.19.93 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
ఇదిలా ఉంటే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,220.07 కోట్లు పెరిగి 6,73,585.09 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.13,592.73 కోట్లు పెరిగి రూ.7,06,573.08 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,684.58 కోట్లు పెరిగి రూ.10,78,493.29 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,541.48 కోట్లు పుంజుకుని రూ.7,17,796.25 కోట్ల వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఎల్ఐసీ, భారతీ ఎయిర్ టెల్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ నిలిచాయి.