Rooftop Solar Scheme | పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన `ప్రధానమంత్రి సూర్యోదయ యోజన` పథకం కింద గృహ అవసరాలకు ప్రతి నెలా ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంతో ప్రతి కుటుంబానికి రూ.18 వేల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెడుతూ `ప్రధానమంత్రి సూర్యోదయ యోజన` పథకం కింద కోటి ఇండ్లకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు.
దీనివల్ల ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభించడంతోపాటు ఏడాదిలో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ రూఫ్ టాప్ సోలార్ యూనిట్లతో ఉత్పత్తయ్యే విద్యుత్లో మిగిలిన కరంట్ను విద్యుత్ పంపిణీ వ్యవస్థలకు అమ్ముకోవచ్చుని చెప్పారు. గత నెల 22నలో అయోధ్యలో చారిత్రక రామ మందిర ప్రాణప్రతిష్ట తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో `ప్రధానమంత్రి సూర్యోదయ యోజన` పథకం ప్రకటించారు. దాని కొనసాగింపుగానే ఈ పథకం వివరాలు వెల్లడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
`విద్యుత్ వెహికల్స్ బ్యాటరీల చార్జింగ్ కోసం ఈ పథకం సహాయకారిగా నిలుస్తుంది. భారీ స్థాయిలో విద్యుత్ చార్జింగ్ కేంద్రాల స్థాపనకు ఉపకరిస్తుంది. విద్యుత్ చార్జింగ్ కేంద్రాల స్థాపనతోపాటు విద్యుత్ చార్జింగ్ మౌలిక వసతుల కల్పన, విద్యుత్ చార్జర్ల తయారీ, ఇన్స్టలేషన్, ఆయా కేంద్రాల నిర్వహణ, సాంకేతిక నైపుణ్యంతోపాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు వీలు కలుగుతుంది` అని చెప్పారు. 2070 నాటికి విద్యుత్ తయారీ, వినియోగంలో పూర్తి స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణకు దారి తీస్తుందని చెప్పారు.